
పెహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత దేశంలో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం చిల్లర పనులకు పాల్పడుతున్న ఉదంతాలు వెలుగులోనికి వస్తున్నాయి.
విశాఖపట్నంలో ‘కరాచీవాలా స్టోర్స్’ అని ఒక డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉంది. ఆ దుకాణం విశాఖపట్నంలో ఏనాటి నుండో ఉంది. ఆ దుకాణం వద్దకు కొంతమంది వచ్చి ఆ కరాచీవాలా అనే పేరు ఉండడానికి వీలులేదని దానిమీద కాగితాలు అంటించిపోయారు. ఇంతకీ విషయం ఏంటంటే కరాచీ అన్నది పాకిస్తాన్ దేశంలోని ఓ ప్రధాన నగరం. అక్కడ నుండి దేశ విభజన సమయంలో ఎప్పుడో మన దేశానికి వచ్చిన Nihalchand Chaturani అనే ఆయన వారి ప్రాంతం పేరుతో పెట్టుకున్న దుకాణం ఇది. అది అపర దేశభక్తులకు ఆగ్రహం కలిగించి ఇలాంటి చర్యకు పాల్పడ్డారు. ఈ స్టోర్స్ విశాఖపట్నంలోనే మంచి ప్రాముఖ్యత కలిగినది. అటువంటి దుకాణంపై ఈ రకమైన దాడికి పాల్పడడం పచ్చి చిల్లర పని తప్ప మరొకటి కాదు. దీనితో కొంతమంది చివాట్లు పెట్టడంతో బిజెపి నాయకులు ఉలిక్కిపడి దుకాణం వద్దకు వచ్చి, తమకు అలాంటి ఉద్దేశం లేదని తెలిపి, అంటించిన కాగితాలను తీసి వెళ్ళవలసి వచ్చింది.
అంతకుముందే కర్ణాటకలో బురఖాలు వేసుకుని ముస్లిం మహిళల వేషాలు వేసి, పాకిస్తాన్ జండాలు పట్టుకుని తిరుగుతున్న కొంతమంది వ్యక్తులను పోలీసులకు అనుమానం వచ్చి అడ్డుకున్నారు. బరఖాలు తొలగించి చూస్తే, తీరా వారు ఆడవారు కాదు మగవారు. వారంతా ఈ గ్యాంగ్ కు చెందిన కార్యకర్తలే. పోలీసులు వారి అరెస్ట్ చేసి కేసు పెట్టవలసి వచ్చింది.
ఇలాంటి చిల్లర పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఉగ్రవాద దాడుల తర్వాత దేశంలోని వివిధ విద్యా సంస్థల్లో చదువుతున్న కాశ్మీర్ విద్యార్థులపై దాడులు చేయడం, వారిని కాశ్మీర్ తిరిగి వెళ్లిపోవాలని బెదిరించడం వంటివి ఇలాంటి చిల్లర మనుషులు చేసే పనులు.
విచిత్రం ఏమిటంటే ఇటువంటి చిల్లర పనులను నిరోధించి, దేశ ప్రజల ఐక్యతను కాపాడవలసిన కేంద్ర పెద్దలు ఆ పని చేయకపోగా చూసీ చూడనట్లు ఊరుకోవడం ఇందులో భాగస్వాములు అవడం తప్ప మరొకటి కాదు. దేశం ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో కాశ్మీర్ ప్రజలు ఎంతో ఉన్నతమైన సంస్కారంతో దాడి ప్రదేశం నుంచి పర్యాటకులను సురక్షితంగా కాపాడారు. దాడిని కాశ్మీర్ ప్రజలు నిర్విద్ధంగా తిరస్కరించారు. మరునాడే స్వచ్ఛందంగా బంద్ కూడా పాటించారు. అటువంటి దేశభక్తి, సభ్యత, సంస్కారం ఉన్న వారిపై ఇటువంటి దాడులు చేయడం ఇసుమంత దేశభక్తి ఉన్నవాళ్లు కూడా చేయరు.
కానీ విచిత్రంగా ఈ ముష్కరులు దేశభక్తి ముసుగు వేసుకుని, దేశానికి ద్రోహం చేసే చర్యలకు పాల్పడుతున్నారు. విద్వేషాలు రాజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికలపై కూడా ఉగ్రవాద బాధిత మహిళలపై కూడా దుర్భాషలాడుతూ అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. ఇటువంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే దేశానికి, ప్రజల ఐక్యతకు పెద్ద నష్టమే జరుగుతుంది.
— ఎ. అజ శర్మ